నాలుగో జాము ప్రారంభమైంది.
జాము ముగిసే సమయానికి ఆఖరి కోడు తిరిగి వచ్చి,
"నేను ఊరంతా తిరిగి ఉత్తరపు దిక్కులో ఉన్న రాజుగారి గుర్రపు శాల పక్కగా వెళ్తున్నప్పుడు
మాటల శబ్దం వినపడింది. అది ఒక స్త్రీ ఒక పురుషుడితో చేస్తున్న రహస్యసంభాషణ అని
అర్థమై వినటం కోసం చాటుగా నిలిచాను. ఆ స్త్రీ,
'మనోహరా, మనం కలవటం చాలా కష్టంగా ఉంది.
ఏం చేయగలను? పాపాత్ముడు, నా మగడు అయిన రాజు
ఒక నెల నుండి రోజూ నా అంతఃపురానికి వస్తుండటం వల్ల
నీ దగ్గరకు రావటం కుదరలేదు. విధిలేక రాజు దగ్గర నటిస్తున్నాను.
నెల రోజుల తర్వాత మళ్లీ మనం కలిసే భాగ్యం లభించింది.
ఈ రోజు ఒక కంసాలి వాడు మంచం ఒకటి తెచ్చి, దానికి అద్భుత శక్తులు
ఉన్నాయని చెప్పాడట. అందువల్ల రాజు ఈ రాత్రి అంతఃపురానికి రాలేదు.
ఎక్కడో ఆ మంచం వేయించుకుని పడుకున్నాడు.
నేను ఈ రాత్రంతా ఆనందంగా గడిపినా వేకువకాలం సమీపిస్తున్నందుకు బాధగా ఉంది.
నిన్ను విడిచిపోక తప్పదు గదా!
', అని చెప్పింది.
ఆ పురుషుడు,
'మనోహరీ, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావో నాకు తెలుసు.
కానీ నీ భర్తను నిందించటం నాకు ఇష్టం లేదు.
రాజైన అతడెక్కడ, గుర్రపువాడినైన నేనెక్కడ?
దైవసంకల్పం వల్ల మనం కలిశాము కానీ,
నీ పాదసేవకైనా నేను అర్హుడిని కాను.
అటువంటి రాజుకు భార్యవైన నువ్వు నాతో ఉండటమే నేరం.
అదిగాక అతడిని ఇలా నిందించటం తగదు
', అన్నాడు.
ఆమె ఈ మాటలు వినలేక,
'ఏమిటీ, నువ్వు హీనుడివా?
ఇకపై అలాంటి మాటలు వద్దు.
నువ్వు నా ప్రియుడివి.
రాజును రెండు మాటలన్నందుకే ఇలా అంటున్నావు.
రేపు రాజు ప్రాణాలుతీసి ఇక నీతోనే ఉండబోతున్నాను.
దీనికేమంటావు?
అతడి భోజనంలో విషం కలపటానికి ఒక పరిచారికను నియమించాను',
అని చెప్పింది.
అలా చేయవద్దని అతడు ఎంత వారిస్తున్నా వినిపించుకోకుండా
అక్కడి నుండి ఆమె వెళ్లిపోయింది", అని చెప్పింది.
ధర్మాత్ముడైన రాజుకు అన్ని గండాలున్నందుకు బాధపడుతూ,
తెల్లవారుతున్నందువల్ల మంచంకోళ్లన్నీ మౌనముద్ర దాల్చాయి.
అవి రాత్రి చెప్పిన వృత్తాంతాలన్నీ వింటూనే ఉండిన రాజు,
అప్పుడే మేలుకున్నవాడిలాగా లేచాడు.
అతడికి ఆశ్చర్యం, బాధ, భయం, కోపం అన్నీ కలిగాయి.
ఏమి చేయాలో నిశ్చయించుకుని పెందలకడనే కొలువు కూటం చేరాడు.
Saturday, November 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment