Saturday, November 7, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 3

ఇదే విధంగా మూడవ కోడు కూడా వెళ్లి ఒక జాము గడిచిన తర్వాత తిరిగి వచ్చి,
"నేను చూసింది చెబుతాను వినండి.
తిరిగి తిరిగి పడమటివాడ చేరుకున్నాను. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు భయంకరమైన ఒక ఆకారం నాకు ఎదురుపడింది.
కనుగుడ్లు గిరగిరా తిప్పుతూ, నెత్తిమీద భగభగలాడే నిప్పులకుంపటి పెట్టుకుని, చేతిలో ఉగ్రమైన ఖడ్గంతో ఉన్న ఆ ఆకృతి చూడగానే అదొక మహాభూతమని నాకు అర్థమైంది. నేను జంకకుండా నిలబడటం చూసి,
'ఎవరు నువ్వు?
వెంటనే దారికి అడ్డం తొలగకపోతే గుటుక్కున మింగేస్తాను.
నేను ఢాకిని అనే భూతాన్ని.
రాత్రిపూట ఈ ఊర్లో ఎవరైనా బయట తిరుగుతూ కనపడితే చంపి తింటూ ఉంటాను.
కానీ వారం రోజులనుండీ ఆహారం దొరక్క ఆకలి మీద ఉన్నాను.
త్వరగా ఎవరినైనా విరిచి తింటేగానీ నా ఆకలి తీరదు.
అడ్డం నిలవకుండా దూరంగా పో
', అని కోపంగా చెప్పింది.
దాని మాటలకు నాకు కోపం వచ్చింది.
'దుష్టభూతమా, ఇదా నువ్వు చేసే పని, ఇప్పుడే నీకు బుద్ధి చెప్పి ఈ పట్టణం వాళ్లకి మేలు చేస్తాను',
అని దాని మీదకు ఉరికాను.
దాని తలమీది కుంపటి కిందికి తోసి గర్వం అణిగేలా దెబ్బలు తగిలించాను.
ఆఖరికి అది నాకు మొక్కి, 'బుద్ధి వచ్చింది, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను', అని లొంగిపోయింది.
దాని దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఊరి మధ్యలో ఒక రాతిస్తంభం మీద నిలిపితే ఇక ఈ ఊరికి భూతాల వల్ల భయం ఉండదని కూడా తెలిపింది. నేను దాని చేత ఆ ఖడ్గాన్ని కాళికాలయంలో పెట్టించి తిరిగి వస్తున్నాను. ఆ భూతం ఈ ఊరిని విడిచి ఎటో వెళ్లిపోయింది" అని తన వృత్తాంతం చెప్పింది. ఊరివాళ్లకి భూతం బాధ తప్పించినందుకు మిగిలిన కోళ్లు దాన్ని ఎంతో మెచ్చుకున్నాయి.

No comments:

Post a Comment