Saturday, August 8, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 2

"గుణాకరా, ఈ ప్రాంతంలో పూర్వం విజయపురం అనే పట్టణం ఉండేది.
దానికి సత్యశీలుడనేవాడు రాజు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడనే చక్రవర్తికి సామంతుడు.
ప్రతాపవర్ధనుడు కమలాకరము అనే ఒక గొప్ప పట్టణాన్ని పరిపాలించేవాడు.
ఆయనకు విశ్వనాథుడనే బుద్ధిశాలి మంత్రి.
ప్రతాపవర్ధనుడు చాలామంది రాజులను గెలిచి, సామంతులుగా చేసుకొని, నిరంకుశంగా వాళ్ల దగ్గర కప్పం వసూలు చేసేవాడు.

అలాంటి మరొక సామంతుడు ఘూర్జర రాజ్యాధిపతి హేమవర్మ.
ఆయన కూతురైన సుందరీమణి ఎన్నో శుభలక్షణాలు గలది.
యుక్తవయస్కురాలైన ఆమెకు వివాహం చేయాలని హేమవర్మ వరులను వెదకసాగాడు.
కానీ, విజయపురం రాజైన సత్యశీలుడి గురించి విన్న సుందరీమణి, అతడినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.
సత్యశీలుడికి రహస్యంగా లేఖ రాసి అతడికి కూడా తనను వివాహమాడాలనే కోరిక ఉందని తెలుసుకుంది.

ఈలోగా ప్రతాపవర్ధనుడు సుందరీమణిని గురించి విని, ఆమెతో తనకు వివాహం జరిపించమని హేమవర్మకు ఒక ఉత్తరం పంపాడు.
చక్రవర్తిని తిరస్కరించలేని హేమవర్మ సుందరీమణికి ఆ లేఖ చూపించగా, ఆమె సత్యశీలుడి గురించి తండ్రికి తెలిపింది.
కుమార్తెకు వ్యతిరేకంగా చేయటం ఇష్టం లేక, హేమవర్మ ప్రతాపవర్ధనుడికి విషయం తెలియజేశాడు.

అందుకు ప్రతాపవర్ధనుడు మండిపడి, "సుందరీమణి సత్యశీలుడిని పెళ్లాడినా ఆమెను విడువక, సత్యశీలుడిని రాజ్యభ్రష్టుని చేసి, కారాగారంలో ఉంచి, ఆమెను వశం చేసుకొంటాను", అని సభలో ప్రకటించాడు. అప్పటినుండి విజయపురాన్ని ఆక్రమించుకోవటానికి సమయం చూడసాగాడు.

ఇంతలో కొంతకాలానికి సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగి, ఆమె భర్తతో విజయపురానికి రాణిగా వచ్చింది.

సత్యశీలుడి మంత్రి వసుదేవుడు.
భట్టిచాణక్యయుగంధరులను మించినవాడు.
అతడి చాకచక్యానికి భయపడి శత్రువులు విజయపురం వంక కన్నెత్తికూడా చూసేవారు కాదు.
ప్రతాపవర్ధనుడు సుందరీమణికోసం ప్రబలసైన్యంతో రెండు మూడు మార్లు దండెత్తి వచ్చినా వసుదేవుడి తంత్రాలకు పరాజయం పాలయ్యాడు. సత్యశీలుడు ప్రతాపవర్ధనుడికి సామంతుడైనా, చక్రవర్తి అక్రమంగా దండెత్తిన కారణంగా వసుదేవుడి సలహామేరకు కప్పం కట్టటం నిలిపి స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. వసుదేవుడి పనులకు కోపం వచ్చినప్పటికీ, ప్రతాపవర్ధనుడు ఏమీ చేయలేక, ఆ మంత్రి లేని సమయంలో పగదీర్చుకోవాలని ఎదురుచూడసాగాడు.

No comments:

Post a Comment