Saturday, August 29, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 5

లోపల ఉన్న సత్యశీలుడు, వీరశేఖరుడు తమకున్న సైన్యంతో వారి దాడిని ఆపలేకపోయారు.
శత్రుసేనలు కోటలో చొరబడ్డాయి.
వీరశేఖరుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం చనిపోయిన శవాల మధ్యలో దాక్కున్నాడు.
సైనికులు సత్యశీలుడిని బంధించి చక్రవర్తి ముందు నిలిపారు.
అంతఃపురం గాలించినా సుందరీమణి కనపడలేదని ప్రతాపవర్ధనుడికి తెలిపారు.
ప్రతాపవర్ధనుడు కోపంతో, "ఓరీ, సుందరీమణిని ఎక్కడ దాచావు? నా ఆధిపత్యం అంగీకరించి ఆమెను అప్పగిస్తే నీ రాజ్యం తిరిగి ప్రసాదిస్తాను. లేకపోతే నీ కండలు తరిగి కాకులకు వేస్తాను", అని బెదిరించాడు. కానీ సత్యశీలుడు భయపడక, "నీచుడా, నువ్వు చక్రవర్తి పదవికి తగవు. నాశనమవుతావు", అని నిందించసాగాడు.

ఆ మాటలకు ప్రతాపవర్ధనుడు కత్తిదూసి సత్యశీలుడి తల నరకబోయాడు.
కానీ మంత్రి విశ్వనాథుడు అతడిని ఆపి, "ఇతడిని చంపితే సుందరీమణికి వైధవ్యం కలుగుతుంది. చక్రవర్తి అలాంటి స్త్రీని చేపట్టరాదు.
ఎప్పటికైనా ఆమె మనకు చిక్కుతుంది. సత్యశీలుడు బతికుండగానే ఆమెను చేపట్టటం గొప్పతనం", అని బోధించాడు.

ఇది యుక్తంగా తోచి, ప్రతాపవర్ధనుడు శివవర్మ అనేవాడిని విజయపురంలో తన ప్రతినిధిగా నియమించి,
సత్యశీలుడిని తనతో కమలాకరపురానికి తీసుకువచ్చి కారాగారంలో బంధించాడు.
సుందరీమణిని కనిపెట్టి తెచ్చినవారికి గొప్ప బహుమానం ప్రకటించాడు.
ఆ ఆశకులోనై చాలామంది వెతికినా ఆమె జాడ తెలిసింది కాదు.

ఇటువంటి సమయంలో ధనంజయుడనే యువకుడు తన బుద్ధిబలం ప్రదర్శించి కొలువులో స్థానం సంపాదించాడు.
కొద్దికాలంలోనే ప్రతాపవర్ధనుడికి అత్యంత ఆప్తుడయ్యాడు. అతడి మాటను చక్రవర్తి దైవవాక్యంలా పాటించసాగాడు.
ధనంజయుడు సుందరీమణిని వెతికించటం కోసం ప్రబలప్రయత్నం మొదలుపెట్టాడు.
ఇది తెలిసిన ప్రతాపవర్ధనుడు ఇంకా సంతోషించాడు.

ఇది జరిగిన కొన్నిరోజులకు జ్ఞానసిద్ధి అనే యోగి, తన శిష్యులతో కమలాకరపురంలో ప్రవేశించి,
ఊరిబయట శివాలయంలో మకాము చేశాడు. అది మొదలు ఆ ఊరి ప్రజలు అతడిని మహాత్ముడని పూజించసాగారు.
అతడు త్రికాలవేది అని పేరుపడటంతో జనం గుంపులు గుంపులుగా అతడి దర్శనం చేసుకోవటం ప్రారంభించారు.

ఒకరోజు ధనంజయుడు ఆ యోగి మహత్యం ప్రతాపవర్ధనుడికి తెలిపి, సుందరీమణి గురించి అతడిని అడిగితే ఫలం ఉండవచ్చని సూచించాడు. ప్రతాపవర్ధనుడు ఆ ప్రకారమే జ్ఞానసిద్ధిని కలిసి, ప్రార్థించి, తన పరిస్థితి తెలిపాడు. ఆ యోగి అప్పుడు ఇలా అన్నాడు,
"మహారాజా, మరో వారం రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నువ్వు ఒక రాజును బంధించి ఉన్నావు. ఆ రాజును పట్టి తెచ్చేటప్పుడు అతడి మంత్రి అక్కడ లేడు. ఆ మంత్రికి విషయం తెలిసి, ఒక ఆడదానికోసం రాజ్యం వదిలి చెరసాలలో ఉండటం బుద్ధిమంతుల లక్షణం కాదని, ఆమె ఎక్కడుందో కనిపెట్టి, మీకప్పగించి, తన రాజును విడిపించుకోవాలనుకుంటున్నాడు".

ఇది విని ప్రతాపవర్ధనుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ప్రతిరోజూ జ్ఞానసిద్ధిని దర్శించుకోసాగాడు.
ఒక వారం గడిచింది.

No comments:

Post a Comment