Saturday, August 15, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 3

ఇంతలో, సుందరీమణి చూలుదాల్చి ఎనిమిది నెలలు గడిచాయి.
వసుదేవుడికి మరో గ్రామానికి వెళ్లవలసిన అవసరం వచ్చి, జయపాలుడనే రెండవ మంత్రిని తను లేని సమయంలో ప్రభువును రక్షించమని నియమించాడు. ఇది ఎంత రహస్యంగా జరిగినా వార్త ప్రతాపవర్ధనుడికి చేరిపోయింది. చక్రవర్తి వెంటనే విజయపురాన్ని చుట్టుముట్టి, నగరానికి రాకపోకలు నిర్బంధించి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.

సైన్యమంతా కోటలో లేకపోవటం, వసుదేవుడు గ్రామానికి వెళ్లటం వల్ల సత్యశీలుడు నిస్సహాయుడై, ఉన్న కొద్ది సైన్యంతోనే ప్రతాపవర్ధనుడిని ఎదుర్కోమని తన సేనాధిపతి వీరశేఖరుడిని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు ఎంత తెలివిగా యుద్ధం చేసినా సైన్యం తక్కువ ఉండటం వల్ల ప్రతాపవర్ధనుడి విజయం తథ్యంగా కనపడసాగింది. సాయంకాలమయ్యేసరికి ప్రతాపవర్ధనుడు యుద్ధం నిలిపి, సైన్యాన్ని విశ్రాంతి తీసుకోమని ఆజ్ఞాపించాడు. మరునాడు కోటలో ప్రవేశించి రాణిని చేపట్టవచ్చని నిశ్చయించి తన గుడారానికి చేరాడు.

ఆ రోజు రాత్రి, గుర్రం మీద ఒక రౌతు ప్రతాపవర్ధనుడి గుడారం వైపు వెళ్లటం చక్రవర్తి సైనికులు గమనించారు.
వాళ్లు అతడిని ఆపినప్పుడు ఆ రౌతు, "నేను చెప్పబోయే విషయం రాజుగారితో తప్ప చెప్పను. నా దగ్గర ఆయుధాలేమీ లేవు. సంశయం లేకుండా నన్ను మీ చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్లండి", అని చెప్పాడు. ఆ రౌతును పరీక్షించి సైనికులు అతడిని చక్రవర్తి ముందు నిలబెట్టారు.

అప్పుడు ఆ రౌతు, "సార్వభౌమా, నేను సత్యశీలుడి సేనాధిపతి వీరశేఖరుడిని. ఈనాటి యుద్దం ముగిసిన తరువాత, గెలవటం సాధ్యం కాదని నేను సత్యశీలుడికి తెలిపాను. యుద్ధం, విరోధం ఆపి, సుందరీమణిని మీకు అప్పగించి సంధి చేసుకోమని వివరించాను. నా మాటలకు కోపగించిన ఆ వివేకహీనుడు నా ముఖాన ఉమ్మి నన్ను సభనుండి వెళ్లగొట్టాడు. నా దుస్థితిని మీకు విన్నవించి శరణుకోరటానికి వచ్చాను", అన్నాడు.

ఇది విన్న ప్రతాపవర్ధనుడికి అనుమానం కలిగినా, విజయపురం రహస్యాలు తెలిసిన సేనాపతి తమ దగ్గర ఉండటం మేలని నిర్ణయించి,
"వీరశేఖరా, రేపు కోటలో ప్రవేశించి, నిన్ను అవమానించిన వాడిని పట్టితెచ్చి, సుందరీమణిని నాకు అప్పగించు. నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది. వెళ్లి మన పనులు నిర్వహించు", అని తన సేనానాయకులను పిలిచి, "ఇతడిని మీకు అధిపతిగా నియమిస్తున్నాను. ఇతని ఆజ్ఞను పాటించండి", అని ఆజ్ఞాపించాడు. వీరశేఖరుడు తన పక్షంలో చేరటంతో విజయం తనదేనని భావించి, వసుదేవమంత్రి తిరిగివచ్చేలోపే సుందరీమణితో కమలాకరపురానికి వెళ్లవచ్చని ఆలోచిస్తూ ప్రతాపర్ధనుడు నిద్రపోయాడు.

వీరశేఖరుడితో యుద్ధం చేసిన ప్రతాపవర్ధనుడి సైనికులు కోట చుట్టూ నిద్రపోతున్నారు. ఆ రాత్రే చక్రవర్తి దగ్గర చేరిన వీరశేఖరుడు సర్వసైన్యాధిపత్యం వహిస్తూ, కోట నాలుగు వైపులా ప్రతాపవర్ధనుడి సేనాపతులను నిలిపి, గుర్రమెక్కి కోట చుట్టూ తిరుగుతూ ఎవరూ లోపలికి, బయటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు.

2 comments: