Saturday, October 17, 2009

మూడవ మకాము - అద్భుత మంచము కథ - 1

గుణాకరుడు, యోగానందుడు వేకువజామునే బయలుదేరి మధ్యాహ్నానికి ఒక పట్టణం దగ్గరలో ఉన్న వనానికి చేరారు.
గుణాకరుడు పట్టణం నుండి సామగ్రి తెచ్చి, వంట చేశాడు.
యోగి భోజనం చేసి విశ్రమించాడు.
శిష్యుడు కూడా భోజనం చేసి గురువు దగ్గర కూర్చుని,
"మహాత్మా, ఈ ఊరిలో ఒక వింత చూశాను.
అంగడివీధి నుండి రాజవీధికి వచ్చే మార్గంలో రాజసౌధం ఎదురుగా ఒక శిలాస్తంభం పైన ఒక పొడుగాటి రాయి నిలిచి ఉంది.
ఊరివాళ్లను దాని వృత్తాంతం అడిగితే, అది ఎప్పటినుంచో అలాగే ఉందనటం కంటే ఎక్కువ చెప్పలేదు.
మీ దివ్యదృష్టితో దాని కథ చెప్ప ప్రార్థన",
అని అడిగాడు.

యోగానందుడు తన ఆత్మదృష్టితో సర్వం తెలుసుకుని, ఇలా చెప్పనారంభించాడు,
"వత్సా, ఇప్పుడు ఈ పట్టణం పరిపాలించే రాజుకు మూడు తరాల ముందు శత్రుంజయుడనే వాడు ఇక్కడి రాజు.
రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతడిలో ఉండేవి.
ఒకరోజు శత్రుంజయుడు కొలువు చేసి ఉన్నప్పుడు ఒక కంసాలివాడు ఒక మంచం తీసుకువచ్చి సభలో ఉంచాడు.
ఆ మంచం విడదీయటానికీ, కావలసినప్పుడు తగిలించి వాడుకోవటానికీ అనువుగా ఉండేలా తయారుచేయటం వల్ల
కంసాలి పెద్దకట్టెలు, అడ్డంగా వేయటానికి చిరుపట్టెలు, కోళ్లు విడదీసి మోపుగా కట్టితెచ్చాడు.
ఇది చూసిన రాజు,
"కంసాలీ, ఈ పనితనంలేని కట్టెలమోపును సభకెందుకు తీసుకువచ్చావు?",
అని అడిగాడు.

అతడు వినయంగా,
"మహారాజా!
ఈ కట్టెలను విడదీసి తగిలిస్తే ఒక మంచం తయారవుతుంది.
చూడటానికి మోటుగా కనపడుతున్నది కానీ దీని ప్రభావం అద్భుతం.
వెల పదివేల వరహాలు.
దీన్ని మీలాంటివారు తప్ప కొనలేరు.
దీన్ని పరీక్షించి చూడండి, దీని మహిమ మీకే తెలుస్తుంది",
అని అన్నాడు.

ఈ మాటలు విని సభలో అందరూ ఆశ్చర్యపోయారు.
ఎగుడుదిగుడుగా ఉన్న ఒక ముతకమంచానికి పదివేల వరహాలా?
వెల ఎక్కువ చేసి ఇచ్చినా రెండు వరహాలు చెయ్యదే అని పకపక నవ్వారు.

ఆ కంసాలి అయినా జంకకుండా,
"దేవరా!
నేను డబ్బులకోసం పొల్లుమాటలు పలకలేదు.
పదివేల వరహాలకు గవ్వ తక్కువైనా ఈ మంచాన్ని అమ్మను.
దీంట్లో వెలకు మించిన మహిమ ఉంది.
మీరు కొనకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్తాను",
అని గట్టిగా చెప్పాడు.

అయినా రాజుకు ఈ మాటలు నమ్మబుద్ధికాలేదు.
నవ్వుతూ మంత్రి వంక చూశాడు.
బుద్ధిమంతుడైన మంత్రి,
"అల్పమైన కొయ్యకు ఇంత వెల చెప్పాడని మనం నిరాకరించకూడదు.
దీని మహిమ ఏమిటో మనకెలా తెలుస్తుంది?
ఇది అంత గొప్ప మంచం కాకపోతే దీన్ని సభకు తీసుకువచ్చి పదివేల వరహాలకు అమ్మే సాహసం చేస్తాడా ఈ కంసాలి?
వీడు అబద్ధం చెబుతుంటే ప్రాణాలతో మిగులుతాడా?
ఏదో మహత్యం ఉందనే నాకు తోస్తూంది.
పనితనం లేదని నిరాకరించవద్దు.
సుగుణాలు ఉన్న వస్తువు చూడటానికి వికారంగానే ఉంటుంది.
పరీక్షించాలనిపిస్తే తీసుకోండి", అని చెప్పాడు.

మంత్రి అంత దృఢంగా చెప్పటంతో శత్రుంజయుడు ఆ మంచాన్ని కొన్నాడు.
ఎలా వాడాలో కంసాలి దగ్గర తెలుసుకున్నాడు.
ఆ రాత్రికి ఏకాంతంగా ఈ మంచం మీద తనకు పడక ఏర్పాటు చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు.

భోజనం పూర్తిచేసి, రాజు ఆ మంచం మీద పడుకుని, నిద్రకు ఉపక్రమించాడు.







"

Saturday, October 10, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 5

అది రాతి నంది కాదు.
రాగిరేకుతో తయారుచేసినది.
శిల్పి ఎంతో చాతుర్యంతో దాన్ని నిర్మించి, ఎందుకో వెనుక భాగాన ఒక రంధ్రం ఉంచాడు.

బోలుగా ఉండటమేగాక, రంధ్రం కూడా ఉండటంతో కుబేరగుప్తుడి రాయి తగలగానే నందినుంచి ధణధణమని శబ్దం వచ్చింది.
కుబేరగుప్తుడు అది విని,
"ఓహో, నంది శివుడి ఆజ్ఞ ప్రకారం డబ్బు తెచ్చాడు.
నాకు ఇవ్వటం ఇష్టం లేక పొట్టకింద దాచిపెట్టుకున్నాడు.
రాయి తగలగానే దొంగతనం తెలిసింది.
దొంగా, ఎంత మోసగాడివిరా, వదిలిపెడతానా, ఎవడి అబ్బ సొమ్మని దాచుకున్నావు",
అని తిడుతూ నందిని సమీపించాడు.
విగ్రహాన్ని కిందికి తోసి డబ్బు తీసుకుందామని ప్రయత్నించాడు కానీ నంది దృఢంగా ఉంది.
తోయటానికి పట్టు దొరుకుతుందేమోనని వెతికాడు.
తోక కింద ఉన్న రంధ్రం చేతికి తగిలింది.
లోపల చేయి పెట్టి డబ్బులు ఉన్నాయో లేవో చూద్దామని ప్రయత్నించాడు.

చేయి మొత్తం లోపల పెట్టి నాలుగు వైపులా వెతికాడు కానీ డబ్బులు లేవు!
కుబేరగుప్తుడు తెల్లబోయి ఇక చేసేదేమీలేక చేయి బయటికి తీయబోయాడు.
పాపం, చేయి వెనక్కి వచ్చింది కాదు.
కొంచెం సేపు గుంజి చూశాడు.
మోచేయి వాచింది కానీ చేయి బయటికి రాలేదు.
"ఓరి నందిగా!
డబ్బు మాట తర్వాత.
ముందు నా చేయి విడువు.
వదులు, వదులు",
అని నందీశ్వరుడే తన చేయి పట్టుకున్నట్లు భ్రమపడి, తిట్టి, బ్రతిమాలి, కొట్టి, పెనుగులాడాడు.
ఎంతకీ చేయి రాదే!

కుబేరగుప్తుడు ఇలాంటి స్థితిలో ఉండగా, అంతకు ముందు ఎంత వేడుకున్నా పలకని శివలింగం నుండి,
"నందీ!", అని వినపడింది.
కుబేరగుప్తుడి ఆశ్చర్యం తీరకముందే, అంతవరకూ మూగగా ఉన్న ఆ రాతి నంది,
"దేవా! ఆనతి ఇవ్వండి",
అని సమాధానం ఇచ్చింది.
"ఈ సాయంత్రంలోగా వేదశర్మకు చేరవలసిన పదివేలు చేరాయా?"
"స్వామీ, ఈ మధ్యాహ్నమే రెండువేలు ఇప్పించాను.
మిగిలిన ఎనిమిది వేలు కూడా ఇవ్వమని ఈ వర్తకుడిని పట్టుకుని ఉన్నాను.
ఇవ్వను అని గింజుకుంటున్నాడు.
ఎంత లాగినా ఇవ్వక తప్పదు.
ఇంకో ఘడియలో కాసు కూడా కొరతలేకుండా ఇప్పిస్తాను",
అని పలికింది.

ఈ మాటలు వినగానే కుబేరగుప్తుడి కోపం, దుఃఖం, రోషం అన్నీ ఒకేసారి కలిగాయి.
"ఛీ, మోసగాడా,
రెండువేలు ఇప్పించావా?
ఇంకో ఎనిమిది వేలు కూడా నా ద్వారా ఇప్పిస్తావా?
ఇదా నీ గొప్పతనం?
పోయిన డబ్బులు పోయాయి గానీ, మరో ఎనిమిది వేలు ఇచ్చేవాడెవడు? నీ తరమేనా?
నా చేయి వదులు, ఇక చాలు
", అని విడిపించుకోవటానికి మళ్లీ ప్రయత్నించాడు.

ఇంతలో దీపం వెలిగించటానికి గుడి తలుపులు తీసిన అర్చకుడు, లోపలి శబ్దాలు విని,
"అయ్యో, గుడిలో భూతం చేరింది.
నన్ను చంపక వదలదు.
ఊపిరి ఉంటే నువ్వులు అమ్మి అయినా బ్రతకవచ్చు",
అని ధర్మకర్త ఇంటికి పరుగున వెళ్లాడు.
ధర్మకర్త అతడి మాటలు విని,
"దేవళంలో భూతమేమిటయ్యా?
ఏమి శబ్దం విన్నావో.
సరే, తెలుసుకుందాం పద",
అని నలుగురు మనుషులను కూడా వెంటవేసుకుని గుడికి వెళ్లాడు.

లోపల నందిలో చేయి పెట్టి ఉన్న కుబేరగుప్తుడిని చూసి ధర్మకర్త ఆశ్చర్యపోయాడు.
ఏమి జరిగిందో చెప్పటానికి ముందు సిగ్గుపడినా, వృత్తాంతమంతా చెప్పి,
"రెండువేలు పోతే పోయాయి.
ఇంకో ఎనిమిది వేలు కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను",
అని కుబేరగుప్తుడు శపథం చేశాడు.
ఇదంతా మెల్లగా ఊరందరికీ తెలిసి అందరూ గుడిచుట్టూ చేరారు.
ఒక్కొక్కరూ ఒక్కో ఉపాయం ఆలోచించి చెప్పసాగారు.
ఇంతలో ఒక బుద్ధిమంతుడు,
"వేదశర్మను పిలిపించి, కుబేరగుప్తుడి చేత ఎనిమిదివేలు ఇప్పించండి.
ఒకవేళ చేయి తిరిగిరాకపోతే డబ్బులు తిరిగి తీస్కోవచ్చు", అన్నాడు.
ఇది చాలామందికి సబబుగా తోచినా కుబేరగుప్తుడు ఒప్పుకోలేది.
తండ్రి బాధ చూడలేక కుబేరగుప్తుడి కుమారుడే వేదశర్మను పిలిపించి ఎనిమిది వేలు సమర్పించాడు.
మరుక్షణమే కుబేరగుప్తుడి చేయి బయటికి వచ్చేసింది!
ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కుబేరగుప్తుడు మాత్రం కోపంతో కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత మనుషులను పెట్టి, ఆ గుడినుండి శివలింగాన్ని, నందిని పెకలింపజేసి, ఊరి బయట ఒక అగాధంలో విసిరివేయించాడు. మరునాడు ఇది తెలిసిన గ్రామప్రజలు అతడిని విచారింపబోగా, అతడు ఆ ముందునాటి రాత్రే ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిసింది.
మరో లింగం స్థాపించాలని ప్రయత్నించినా అనేక అంతరాయాల వల్ల అది జరిగింది కాదు.
క్రమంగా ఆ గ్రామం క్షీణించింది. తర్వాత వచ్చిన వాళ్లు దూరంగా నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ గుడి ఇంత సుందరంగా ఉన్నా పూజ, అర్చనల వంటివి లేకపోవటానికి ఇదే కారణం,
అని కథ ముగించాడు.

Saturday, October 3, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 4

అక్కడ ఆడుకుంటున్న అర్చకుల పిల్లలకు మాయమాటలు చెప్పి, కొబ్బెర, బెల్లం ఇచ్చాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.

అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.

"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.

ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.

Saturday, September 26, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 3

లోపలికి వచ్చిన వేదశర్మతో,
"స్వామీ, మరేమీ లేదు. ఒక చిన్న విషయం.
ఈ సాయంత్రంలోగా మీకేమైనా ధనలాభం కలిగితే అది నాకు చెందేలాగా ఒక చీటీ రాసి ఇవ్వవలసింది.
నేను ఒక కారణం వల్ల ఇలా అడుగుతున్నాను", అని అన్నాడు.

కపటమెరుగని వేదశర్మ,
"సాయంత్రంలోగా నాకు కలిగే లాభమేముంది?
అయినా, ఇంత ధనమిచ్చిన ఇతడికి ఆ చీటీ రాసివ్వటం ఉచితమే"
అని ఆలోచించి, "సరే, అలాగే రాసి ఇస్తాను", అన్నాడు.

ఆ వర్తకుడు సిద్ధంగా ఉన్న తాటాకు, గంటము తెచ్చి,
"శాలివాహన శకము 436 వ సంవత్సరమునకు సరియైన అక్షయసంవత్సర వైశాఖశుద్ధ దశమి గురువారము
కుబేరగుప్తుడను వర్తక శిఖామణికి వేదశర్మ యనెడి నేను వ్రాసియిచ్చిన యాదాయబాధ్యత విడుదల పత్రము.
యేమనిన నేటి సాయంకాలములోపల యిపుడు వర్తకుని వలన నేను పొందినధనము తప్ప మరి నాకు కలిగెడి
యెట్టిలాభముగాని యీవణిక్శిఖామణికి చెందవలసినదియేకాని, నాకును నావారసులకును యేలాటి బాధ్యతయును
లేదు. ఇది నేను మనఃపూర్వకముగా స్వహస్తముతో వ్రాసియిచ్చిన పత్రము,
వేదశర్మ చేవ్రాలు"
అని పత్రం రాయించుకున్నాడు.
వేదశర్మను ఇంటికి సాగనంపి, సాయంత్రంలోగా ఎనిమిదివేల నిష్కములు వస్తాయని ఎదురుచూడటం మొదలుపెట్టాడు.
వేదశర్మ తన భార్యకు జరిగినదంతా చెప్పి, తన బిడ్డలతో తృప్తిగా తిని, సుఖంగా ఉన్నాడు.

కుబేరగుప్తుడు మధ్యాహ్నం దాకా ఎలాగో గడిపాడు కానీ, తర్వాత అతడి మనసు పరిపరివిధాల ఆలోచించింది,
"అయ్యో! బుద్ధిహీనుడా! నీ ప్రతిభ ఇంతేనా?
దయ్యమో భూతమో దేవళంలో అన్న మాటలు విని చేజేతులా రెండువేలు సమర్పించుకున్నావే!
ఆ డబ్బు వస్తుందని ఏమి నమ్మకం? "
అని తనను తాను నిందించుకున్నాడు.
మళ్లీ వెంటనే,
"ఛీ, గుడిలో పిశాచాలుంటాయా!
శివుడు నందితో అన్న మాటలు స్పష్టంగా విన్నాను కదా.
భగవంతుడు అబద్ధం చెప్తాడా?
ధనం తప్పకుండా వస్తుంది",
అని ఆలోచించి తుదకు ఇలా నిశ్చయించుకున్నాడు,
"సరే! జరగవలసింది జరిగిపోయింది.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.
ప్రయత్నిస్తాను. డబ్బు వచ్చిందా సంతోషం.
లేకపోతే ఇద్దరు మనుషులతో వేదశర్మ ఇల్లు దోపిడీ చేయిస్తాను.
ఇప్పటికి అతడేమీ ఖర్చుపెట్టి ఉండడు".

కుబేరగుప్తుడు సాయంత్రం వరకూ ఇలా కాలం గడిపి, డబ్బు తెచ్చుకోవటానికి సంచులు,
కొంచెం కొబ్బెర, బెల్లం తీసుకొని, పైపంచె కప్పుకొని, సూర్యాస్తమయం అయ్యేసరికి ఎవరికీ తెలియకుండా శివాలయం చేరుకున్నాడు.

Saturday, September 19, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 2

అతనికి దుర్బుద్ధి పుట్టి, మనసులో, "ఓహో, బికారి బాపడికి శివుడు పదివేలు ధనం ఇవ్వదలిచాడు.
అది నేడే జరిగేలా ఉంది. నందీశ్వరుడు సాయంకాలంలోగా ఇస్తానని అంగీకరించాడు.
ఏదైనా ఉపాయం వెతికి వేదశర్మకి రానున్న డబ్బును అపహరించాలి", అని ఆలోచిస్తూ
పరుగున ఇంటికి వెళ్లి, భిక్షాటన కోసం ఆ వీధికి రోజూ వచ్చే వేదశర్మ కోసం బయట కాచుకు కూర్చున్నాడు.

వేదశర్మ ఎప్పటిలాగే గ్రామమంతా తిరిగి దొరికిన కొద్ది బియ్యంతో, ఆకలికి పిల్లలు నకనకలాడుతుంటారని, త్వరత్వరగా ఇంటివైపు వెళ్లసాగాడు.
దారిలోనే కాచుకున్న కుబేరగుప్తుడు వేదశర్వ కనపడగానే మహావినయంతో నమస్కరించి,
"స్వామీ, మీ ప్రభావం గురించి ఇప్పుడే తెలిసింది.
నేను ఈ రోజు ఒక గొప్ప దానం చేయదలిచాను.
పరమయోగ్యులైన మీకే ఆ దానమివ్వాలని ఇక్కడ వేచి ఉన్నాను.
ఆ దానానికి మీరే అర్హులు.
మా ఇంటిలోకి దయచేసి దానం పుచ్చుకోండి",
అని కోరాడు.

ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
ఎందుకంటే ఆ ఇంటిముందునుంచి ఎప్పుడు వెళ్లినా, కుబేరగుప్తుడు మహాకోపంతో ఛీకొట్టి,
"పో పో, రోజూ నీకు భిక్షమెవరు పెడతారు?
అందరూ సంసారాలున్నవాళ్లే.
వారివారి కష్టాలెన్నో ఉంటాయి.
శనిలాగా వచ్చి వాకిట నిలుస్తావు.
ఒకసారి చెపితే అర్థం కాదా?
నీకు బుద్ధిలేదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో",
అని నానాదుర్భాషలాడి, ఒక్కనాడు కూడా పిడికెడు బియ్యమైనా ఇవ్వకుండా తరిమేవాడు.
తను బాధపడకుండా, ఇది తన దారిద్ర్యఫలితమని భావించి, కుబేరగుప్తుడు చెప్పేవి నిజాలే అయినా,
తన దుర్దశ వల్ల, రోషానికి పోకుండా, భిక్షం పెట్టినా పెట్టకపోయినా రోజూ అతడి ఇంటితో సహా అన్ని ఇళ్లకూ వెళ్లేవాడు.

ఒక్కరోజు కూడా బిచ్చం పెట్టని ఆ వర్తకుడు ఇప్పుడు వినయంగా ఆహ్వానించి దానం ఇస్తాననటం వేదశర్మకు కలలా అనిపించింది.
ఇదంతా దైవకృప అనుకొని,
"అయ్యా, మహద్భాగ్యం.
మీ ఇష్టం వచ్చినట్లే చేయండి.
కానీ, ముందు నా దగ్గరున్న బియ్యం తీసుకువెళ్లి నా భార్యాపిల్లలకు ఇచ్చి వస్తాను.
వాళ్లు ఆకలితో ఉంటారు",
అని చెప్పాడు.

కుబేరగుప్తుడు చాలా జాలిపడుతున్నట్లు నటించి,
"అయ్యో, పాపం, పసిపాపలు కదా, ఎంత కష్టపడుతున్నారో.
దారిద్ర్యమెంత దుఃఖకరం. స్వామీ, ఈ పనికోసం మీరు వెళ్లనక్కర్లేదు.
అన్నీ నేను చూసుకుంటాను, మీరు లోపల కూర్చోండి.
మీకు కావలిసిన సామగ్రి ఇప్పుడే సేవకుడితో పంపిస్తాను",
అని వేదశర్మ చేయి పట్టుకుని, లోపలికి తీసుకువెళ్లి, ఉన్నతపీఠం పైన కూర్చోబెట్టి,
ఒక సేవకుడితో, నాలుగు ముంతల బియ్యం, తగినంత ఉప్పు, పప్పు, నేయి, నూనె, కూరలు, విస్తళ్లు వేదశర్మ ఇంటికి పంపాడు.

సేవకుడు అలాగే చేసి, "అయ్యగారు రావటానికి కొంత ఆలస్యమౌతుంది. పెద్ద సెట్టి గారింట్లో ఉన్నారు", అని చెప్పి తిరిగివచ్చాడు.
ఆ రోజు వేదశర్మకు సముద్రం పొంగినంత ఆనందం కలిగింది. కుబేరగుప్తుడి ప్రవర్తన దైవలీలగా భావించాడు.
ఇంతలో కుబేరగుప్తుడు ఒక తట్టలో తమలపాకులు, వక్కలు, ఏలకాయలు, లవంగాలు, రెండువేల నిష్కములు తెచ్చి వేదశర్మకు సమర్పించి,
"స్వామీ, మిమ్మల్ని ఇన్నాళ్లూ చులకనగా చూసినందుకు దోషపరిహారముగా అల్పమైన ఈ మొత్తాన్ని స్వీకరించి,
మీ దాసుడినైన నన్ను దీవించండి", అని ప్రార్థించాడు.

రెండువేలను అల్పమైన మొత్తం అంటున్న ఆ వర్తకుడి మాటలు వేదశర్మకు వింతగా తోచాయి.
కుబేరగుప్తుడు కోరినట్లే ఆ ధనం స్వీకరించి, అతడిని ఆశీర్వదించి వేదశర్మ తన ఇంటికి బయలుదేరాడు.
కానీ, కుబేరగుప్తుడి ఇంటివాకిలి దాటాడో లేదో, ఆ వర్తకుడు ఏదో చెప్పటం మరచిన వాడిలా పరుగు పరుగున బయటికి వచ్చి,
"స్వామీ, స్వామీ, ఒక మాట, ఇటు రండి", అని పిలిచాడు.

Saturday, September 12, 2009

రెండవ మకాము - పేద విప్రుని కథ - 1

మరునాడు గురుశిష్యులు అక్కడికి ఇరవై గడియల దూరంలో ఉన్న
మరో ఊరిబయట శివాలయానికి చేరారు. గుణాకరుడు సమీపాన ఉన్న ఒక చిన్న పల్లెకు
వెళ్లి దినుసులు, సామగ్రి తెచ్చి వంట చేశాడు. యోగానందుడు భోజనం చేసి విశ్రమించాడు.
తరువాత గుణాకరుడు కూడా తిని, పాత్రలు శుద్ధిచేసి వాటికోసం వచ్చిన ఒకడికి ఇచ్చి
తిరిగిపంపాడు. గుణాకరుడు గురువు దగ్గర కూర్చుని, "
స్వామీ, ఈ దేవళం మంచి పనితనంతో దృఢంగా ఉంది.
కానీ ఇందులో శివలింగం కానీ, వేరే చిహ్నం కానీ లేదు.
ఇందుకు కారణమేమిటి", అని అడిగాడు.
అందుకు యోగానందుడు ఇలా చెప్పనారంభించాడు.

గుణాకరా, ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఒక గొప్ప పల్లె ఉండేది.
ఈ శివాలయానికి తూర్పుపడమరలుగా ఒక సన్నిధి వీధి, దానికి రెండువైపులా చిన్నచిన్నవీధులు, వాటిలో వర్తకులు, బ్రాహ్మణుల ఇళ్లు ఉండేవి.
గ్రామంలో అందరూ కొద్దోగొప్పో ధనవంతులే అయినా వేదశర్మ అనే బ్రాహ్మణుడు మాత్రం నిత్యదరిద్రంతో బాధపడేవాడు.
భార్యను, ఐదుగురు పిల్లలను పోషించటానికి రోజూ భిక్షం ఎత్తి దొరికిన చాలీచాలని బియ్యంతోనే తృప్తిగా ఉండేవాడు.

ఈ శివాలయం అప్పట్లో మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుపుకుంటూ ఉన్నతస్థితిలో ఉండేది.
వేదశర్మ రోజూ ఉదయాన్నే ఈ ఆలయానికి నూటయెనిమిది ప్రదక్షిణలు చేసి, తన అక్షయపాత్రతో ఊరిలోకి వెళ్లేవాడు.

ఒకరోజు ఎప్పటిలాగే వేదశర్మ ప్రాతఃకాలాన ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసుకుని బయటికి వెళ్లాడు.
అదే సమయానికి గుడివెనుక దంతధావనం చేసుకుంటున్న కుబేరగుప్తుడనే ధనవంతుడికి గుడిలోనుండి కొన్ని మాటలు వినిపించాయి.
దేవళంలో ఈశ్వరుడు పిలిచినట్లు,"నందీ, నందీ", అని వినపడింది.
ఈ వింత ఏమిటో చూద్దామని, కుబేరగుప్తుడు గుడిగోడకు ఆనుకుని చెవులు రిక్కించాడు.
"దేవా, సేవకుడిని, మీ ఆజ్ఞకోసం సిద్ధంగా ఉన్నాను", అని నందీశ్వరుడు చెప్పటం వినపడింది.
"నందీ, మరేమీ లేదు కానీ, నిత్యదరిద్రుడైన వేదశర్మ రోజూ వచ్చి నన్ను సేవిస్తుంటాడు.
పాపం, అతని మీద నాకు చాలా కనికరం కలిగింది.
ఏదైనా సహాయం చేయదలిచాను. కాబట్టి నువ్వు నా ఆజ్ఞ ప్రకారం, నేటి సాయంత్రం లోపల అతడికి పదివేల నిష్కములు చేరేలా చెయ్యి", అని శివుడు పలకటం,
"స్వామీ, తమ ఆజ్ఞ", అని నంది అంగీకరించటం కుబేరగుప్తుడు స్పష్టంగా విన్నాడు.

Saturday, September 5, 2009

మొదటి మకాము - సుందరీమణి సత్యశీలుల కథ - 6

మరుసటిరోజు ఒక గుర్రపురౌతు సభకు వచ్చి చక్రవర్తికి ఒక ఉత్తరం అందించాడు.
ఆ ఉత్తరంలో,
"మహారాజా, సత్యశీలుడి మంత్రి వసుదేవుడు ఆశీర్వదించి వ్రాస్తున్న విజ్ఞాపన.
మీరు దండెత్తినప్పడు నేను లేకపోవటం వల్ల ఇంత జరిగింది.
నేను ఉండి ఉంటే సుందరీమణిని మీకు అప్పగించమని సలహా ఇచ్చేవాడిని.
మీతో విరోధం మాకు క్షేమం కాదు.
నేటికి ఐదవరోజు మీరు కోరిన రాణిని నేను అప్పగిస్తాను.
విరోధం విడిచి మా రాజును, రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని విన్నపం, వసుదేవుడు", అని ఉంది.

ప్రతాపవర్ధనుడు అది చదివి ఆనందంతో దాన్ని ధనంజయుడికి ఇచ్చి,
"వసుదేవుడు ఈ ఉత్తరం పంపి ఐదు రోజులయింది.
కాబట్టి, ఇప్పటికే రాణితో ఊరికి చేరి ఉంటాడు.
మనం బయలుదేరుదాం పద", అని కొలువు చాలించాడు.

చక్రవర్తి అలంకరించుకొని సిద్ధమై ఉండగా, ధనంజయుడు అక్కడికి వచ్చి,
"ప్రభూ, వసుదేవుడు ఊరి బయట ఉన్నానని వార్త పంపాడు.
మీ వెంట పరివారం చాలా తక్కువ ఉండాలనీ, సుందరీమణి ఆడంబరంగా రావటానికి జంకుతోందనీ తెలియజేశాడు.
సత్యశీలుడిని కూడా మనతో తీసుకు వెళ్లి, అతడి ముందే మీరు ఆమెను చేపట్టాలని నా కోరిక", అన్నాడు.
ప్రతాపవర్ధనుడికి కూడా అదే ఇష్టమవటంతో, సత్యశీలుడికి ఒక పల్లకీ ఏర్పాటు చేశాడు.
తమతో ధనంజయుడు, కొద్దిమంది భటులు తప్ప మరెవరూ రాకూడదని ఆజ్ఞాపించాడు.
అప్పటికే రాత్రి అయినా, వసుదేవుడి కోరిక మేరకు దివిటీలు లేకుండానే అందరూ బయలుదేరారు.

ఊరి బయట శివాలయం దగ్గర ఒక మూతపల్లకీతో ఉన్న వసుదేవుడు చక్రవర్తి అక్కడికి చేరగానే,
"మహారాజా, పల్లకీలో సుందరీమణి ఉంది.
ఆమెను స్వీకరించి, మా రాజును మాకు అప్పగించండి", అన్నాడు.
ప్రతాపవర్ధనుడు వెంటనే ఆ పల్లకీలో ఎక్కి కూర్చున్నాడు.
ధనంజయుడు, "చక్రవర్తి పల్లకీని నగరంలోకి తీసుకువెళ్లండి", అని తమతో వచ్చిన బోయీలను ఆజ్ఞాపించాడు.
వాళ్లు సత్యశీలుడున్న పల్లకీని దింపి, ప్రతాపవర్ధనుడున్న పల్లకీని సమీపిస్తుండగా మరుగున ఉన్న కొందరు భటులు వచ్చి వాళ్లను, చక్రవర్తితో వచ్చిన భటులను సంహరించారు.

పల్లకీలో ఉన్న ప్రతావవర్ధనుడికి ఇదేమీ తెలియక, తన పక్కనే ఉన్న స్త్రీ చేతులను అందుకోవటానికి ప్రయత్నించాడు.
ఆమె వెంటనే చక్రవర్తి చేతులకు తన దగ్గర ఉన్న సంకెలలు బిగించింది.
తరువాత తన స్త్రీ వేషం తొలగించి, "పాపాత్ముడా, పరస్త్రీని మోహించి, మా రాజును బంధించినందుకు ఫలం అనుభవించు", అని తాను జయపాలుడన్న విషయం బయటపెట్టాడు. జరిగినదంతా వసుదేవుడి మాయ అని ప్రతాపవర్ధనుడికి అర్ధమై ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు.

రాత్రి ప్రయాణం చేసి అందరూ విజయపురం ప్రవేశించారు.
వీరశేఖరుడు కొద్దిమంది భటులతోనే కోటలోకి వెళ్లి శివవర్మను చంపి, పట్టణం వశం చేసుకున్నాడు.
సత్యశీలుడు సింహాసనం అధిష్ఠించి, ప్రతాపవర్ధనుడిని చెరసాలలో బంధించాడు.

గుణాకరా, ఇదంతా నీకు వింతగా తోచవచ్చు.
రహస్యం చెప్తాను విను.
వసుదేవుడు లేని సమయంలో ప్రతాపవర్ధనుడు దండెత్తి విజయపురాన్ని ముట్టడించాడు కదా.
అప్పుడు మంత్రిగా ఉన్న జయపాలుడు వీరశేఖరుడి వేషంలో చక్రవర్తిని మోసం చేసి, సుందరీమణిని బయటికి తరలించటానికి సహాయపడ్డాడు.
పని జరగగానే జయపాలుడు అక్కడి నుండి బయలుదేరి సుందరీమణిని, సత్యశీలుడి స్నేహితుడైన ఒక భిల్లరాజు దగ్గర కొండలలో భద్రంగా దాచాడు. తరువాత వసుదేవుడిని కలిసి జరిగినది వివరించాడు.
ఆ పక్క రోజు, శవాలలో దాక్కున్న వీరశేఖరుడు కూడా వీరిని చేరి, చక్రవర్తి సత్యశీలుడిని కమలాకరపురం చెరసాలలో బంధించాడని తెలిపాడు.

అప్పుడు వసుదేవుడు వీరశేఖరుడిని ధనంజయుడి రూపంలో పంపి, తాను యోగి రూపంలో చక్రవర్తి నగరంలో ప్రవేశించాడు.
ఉత్తరంలో చెప్పిన ప్రకారం జయపాలుడు స్త్రీరూపం ధరించి భటులతో, వసుదేవుడితో ఊరిబయట వేచి ఉన్నాడు.
తరువాత జరిగినదంతా నీకు తెలుసు. ఆ పై వృత్తాంతం విను.

తమ చక్రవర్తి విజయపురంలో బందీగా ఉన్నాడన్న విషయం ప్రతాపవర్ధనుడి మంత్రి విశ్వనాథుడికి తెలిసింది.
ఎంత సైన్యంతో వెళ్లినా వసుదేవుడి జిత్తులను ఓడించి గెలవటం అసాధ్యమని నిర్ణయించి, సంధి కోసం బయలుదేరాడు.

సత్యశీలుడు, వసుదేవుడు విశ్వనాథుడిని గౌరవసత్కారాలతో ఆహ్వానించారు.
విశ్వనాథుడు తన చక్రవర్తి తప్పలను ఒప్పుకొని, తమ రాజ్యాల మధ్య ఇకపై విరోధం ఉండదని ప్రమాణం చేశాడు.
విశ్వనాథుడు నమ్మదగ్గవాడు కాబట్టి, సత్యశీలుడి అనుమతితో వసుదేవుడు ప్రతాపవర్ధనుడిని విడిచిపెట్టాడు.
చక్రవర్తి సత్యశీలుడు చూపిన మర్యాదకు పశ్చాత్తాపపడి, తన పనులకు సిగ్గుపడి, దీనంగా విశ్వనాథుడితో కమలాకరపురానికి తిరిగివెళ్లాడు. తరువాత సత్యశీలుడు సుందరీమణిని తిరిగి విజయపురానికి పిలిపించి, ఆమె కోరిక ప్రకారం, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్లు ప్రతాపవర్ధనుడిలా అధోగతి పాలవుతారని తెలిపేలా నువ్వు చూసిన వింతను నగరమధ్యంలో స్థాపించింది. తరువాత ఎన్నో శతాబ్దాలు గడిచి ఆ పట్టణాలన్నీ అంతరించాయి. విజయపురం ఉన్న స్థానంలో ఈ పల్లె ఏర్పడింది. ఆ పట్టణం పోయినా, వారు నిలిపిన లోహవిగ్రహం మాత్రం గుర్తుగా మిగిలిపోయింది", అని ముగించాడు.